ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనం: నారా లోకేష్

  • విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ రద్దు కాలేదని ప్రభుత్వం స్పష్టీకరణ
  • పశ్చిమాసియా యుద్ధం కారణంగా నెలరోజులు ఆలస్యం
  • పాఠశాలలు తెరిచేనాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ పంపిణీ
  • యూనిఫాం, బూట్లు, బ్యాగ్‌ల సరఫరాకు కొంత సమయం
  • వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిగా నిలిపివేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారం వందశాతం అవాస్తవమని, కిట్ల పంపిణీని ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం కొన్ని అంతర్జాతీయ కారణాల వల్ల కిట్ల సరఫరాలో సుమారు నెల రోజుల జాప్యం జరుగుతోందని తెలిపారు.

ప్రభుత్వం నిజాయతీగా జాప్యం గురించి వెల్లడిస్తే, దానిని వక్రీకరించి అసలు కిట్లే ఇవ్వరంటూ వైసీపీ పార్టీ విష ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనమని విమర్శించారు.

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిసరుకుల ధరలు పెరగడం, రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో యూనిఫాం క్లాత్, బూట్లు, బ్యాగుల సరఫరా ఆలస్యమవుతోందని విద్యాశాఖ అధికారులు తెలిపినట్లు లోకేష్ వివరించారు. అయితే, జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ కచ్చితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు.

మిగిలిన వస్తువులను కూడా వీలైనంత త్వరగా పంపిణీ చేసేందుకు అధికారులు తయారీ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని లోకేష్ పేర్కొన్నారు.

Nara Lokesh
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
TDP
Student Kits
Education
Dr Sarvepalli Radhakrishnan
School Reopening
Textbooks
AP Politics

More Telugu News